ఆపెన్ హైమర్: అణు విధ్వంసం, ప్రపంచ అంతం, విశ్వ నాశనం

ఈ రోజు అణు విధ్వంసం, ప్రపంచ అంతం, విశ్వ నాశనం గురించి బైబిల్ ఏమని చెబుతుందో చూద్దాము. ఈ మధ్యలో గొప్ప అణు శాస్త్రవేత్త రాబర్ట్ ఆపెన్ హైమర్ మీద క్రిస్టోఫర్ నోలన్ అనే దర్శకుడు ఒక సినిమా తీశాడు. దీనిని వలన చాలా మంది ఆపెన్ హైమర్ గురించి మాట్లాడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధము వలన కూడా అణ్వాయుధాల ప్రస్తావన వచ్చింది. ఉక్రెయిన్ మీద రష్యా అణు బాంబులు వేస్తుందా? అనే ప్రశ్న కూడా చాలా మంది అడుగుతున్నారు. 

    రాబర్ట్ ఆపెన్ హైమర్ జీవితం చూస్తే మనకు 20 శతాబ్దములో జరిగిన అనేక ప్రాపంచిక పరిస్థితుల గురించి, సైంటిఫిక్ రంగములో వచ్చిన అనేక మార్పుల గురించి మంచి అవగాహన వస్తుంది. రాబర్ట్ ఆపెన్ హైమర్ అమెరికా దేశములో జన్మించిన గొప్ప అణు శాస్త్రవేత్త. ఆయన 1904 లో న్యూ యార్క్ నగరములో జన్మించాడు. 1967 లో ప్రిన్స్ టన్ నగరములో మరణించాడు. ఆటమ్ బాంబు కు తండ్రి అని ఆయనను మనం పిలుస్తున్నాము. 

    ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ లలో చదువుకొన్నాడు. మాక్స్ బోర్న్, నీల్స్ బోర్, ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్ వంటి వారితో స్నేహం చేసాడు. పాల్ డిరాక్ వంటి వారితో కలిసి క్వాంటమ్ ఫిజిక్స్ లో రీసెర్చ్ చేసాడు. ఆ తరువాత ప్రిన్స్ ట న్ లో వున్న Institute for Advanced Study సంస్థకు డైరెక్టర్ గా పనిచేశాడు. అనేక గొప్ప శాస్త్రవేత్తలను ఈ సంస్థ తయారు చేసింది. అక్కడ ఆయన ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్ కి బాస్ గా ఉన్నాడు. 20 శతాబ్దములో జరిగిన రెండు గొప్ప సైన్స్ విప్లవాల మధ్య ఆపెన్ హైమర్ జీవించాడు. మొదటిది క్వాంటమ్ ఫిజిక్స్, రెండవది రెలెటివిటీ సిద్ధాంతం. క్వాంటమ్ ఫిజిక్స్ రెలెటివిటీ సిద్ధాంతం. ఈ రెండు రంగాల్లో ప్రసిద్ధ చెందిన శాస్త్రవేత్తలతో ఆపెన్ హైమర్ స్నేహం చేశాడు. ఒక వైపు క్వాంటమ్ ఫిజిక్స్ కు పితామహులు వంటి మాక్స్ బోర్న్, వెర్నర్ హైసెన్బెర్గ్, పాల్ డి రాక్ ల దగ్గర ఆయన నేర్చుకొన్నాడు. మరొక వైపు రెలెటివిటీ సిద్ధాంతం సృష్టించిన ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్ తో కలిసి ఫిజిక్స్ లో రీసెర్చ్ చేశాడు. అణువును విచ్చిన్నం చేసిన ఎన్రికో ఫెర్మీ పరిశోధనలు కూడా ఆయన చదివాడు. 

    ఆ విధముగా చిన్న ఆటమ్ నుండి పెద్ద పెద్ద నక్షత్రాలు, గెలాక్షీలు, బ్లాక్ హోల్స్ వరకు ఆపెన్ హైమర్ క్షుణ్ణముగా పరిశోధించాడు. అవన్నీ కూడా దేవుని గొప్ప జ్ఞానముతో చేయబడినవే. దేవుని మహిమ మనకు అర్థం కావాలంటే వాటిని కూడా మనం చూస్తూ ఉండాలి. ఆపెన్ హైమర్ 1904 లో జన్మించాడు. దానికి 4 సంవత్సరాలకు ముందు 1900 సంవత్సరములో జర్మనీ దేశానికి చెందిన మాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ కి పునాదులు వేసాడు. యాటమ్ స్థిరమైనది కాదు, కొన్ని యాటమ్ లలో నుండి ఎంతో రేడియో ఆక్టివిటీ వస్తుంది అని మరీ క్యూరీ గ్రహించింది. ఐజాక్ న్యూటన్ చూపించిన ప్రపంచం కు భిన్నముగా క్వాంటమ్ ప్రపంచం ఉందని ప్రజలు  గ్రహించారు. 

1905 లో ఆపెన్ హైమర్ ఒక సంవత్సరం పిల్లాడు. ఆ  సంవత్సరములో ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్ స్పెషల్ థియరీ ఆఫ్ రెలెటివిటీ ని ప్రచురించాడు. దీని ప్రకారం పదార్థం కూడా శక్తికి ప్రతిరూపమే. దీనిలో నుండే అయిన్ స్టెయిన్ యొక్క ప్రఖ్యాత ఈక్వే షన్ వచ్చింది. E = mc2 – దీని ప్రకారం పదార్థం శక్తిగా మారే వీలు ఉందని ప్రపంచం గ్రహించింది. ఎర్నెస్ట్ రూథర్ ఫోర్డ్ అనే సైంటిస్ట్ అణువులో ఒక సెంటర్ ఉందని గ్రహించాడు. దీనిని నూక్లియస్ అని పిలిచారు. ఈ కేంద్రములో కూడా కొన్ని కణాలు ఉన్నాయని కనిపెట్టారు. ఇవన్నీ చూసి త్వరలో ప్రపంచము యాటమ్ బాంబులు తయారు చేస్తుంది అని చాలా మంది ఊహించారు. 

   ఇంగ్లాండ్ కు చెందిన నవలా రచయిత హ్ జి వెల్స్ 1914 లో The World Set Free అనే  నవల వ్రాశాడు. ప్రపంచం త్వరలో అణు బాంబులు చేస్తుంది అని అందులో ఆయన ఊహించి వ్రాశాడు. 30 సంవత్సరాల్లోనే 1945 లో ఆయన ఊహ వాస్తవ రూపం దాల్చింది. 1930 దశాబ్దములో జర్మనీ లో అడాల్ఫ్  హిట్లర్, ఆయన నాజీ పార్టీ అధికారములో కి వచ్చాయి. నాజీలు అనేక మంది సైంటిస్టులను వేధించారు. అదే వారి నాశనానికి బీజం వేసింది. ఎందుకంటే ఆ సైంటిస్టులు అమెరికా లాంటి దేశాలకు వలస వెళ్లి నాజీల నాశనానికి తమ వంతు సహకారం శత్రు దేశాలకు అందించారు. 

    ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్, ఎన్రికో ఫెర్మీ లాంటి గొప్ప సైంటిస్టులు అమెరికా వెళ్లి అమెరికా మిలిటరీ కి గొప్ప ఆయుధాలు నిర్మించడములో ప్రత్యక్షముగానో, పరోక్షముగానో సహకరించారు. 1938 లో జర్మనీ కి చెందిన నాజీ సైంటిస్టులు యాటమ్ ని విచ్చిన్నం చేయగలిగారు. హిట్లర్ చేతికి యాటమ్ బాంబులు దొరికితే ప్రపంచం ఏమవుతుందో అని చాలా మంది తీవ్ర ఆందోళన చెందారు. నాజీల చేతికి  యాటమ్ బాంబులు దొరకకూడదు అని అందరూ అంగీకరించారు.

ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్ స్వతహాగా శాంతి కాముకుడు. కానీ ఆయన కూడా అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ కు యాటమ్ బాంబులు నిర్మించవలసినదిగా సలహా ఇచ్చాడు. యాటమ్ బాంబులు నిర్మించడానికి అమెరికా దేశం మన్ హాటన్ ప్రాజెక్టు ని రూపొందించింది. దీనికి ఆపెన్ హైమర్ – నాయకత్వం వహించాడు. 

   మేడం క్యూరీ అణు ధార్మికత కు గురై మరణించింది. రేడియో ఆక్టివిటీ మీద ఆమె చేసిన పరిశోధనలు ఆమె ప్రాణాలే బలి తీసుకున్నాయి. అదే ధార్మికతను వాడి ఉద్దేశపూర్వకముగా ప్రాణాలు తీసే ఆయుధాలు రూపొందాయి. 

డిసెంబర్ 2, 1942 

   షికాగో నగరములో ఎన్రికో ఫెర్మీ అణువును విచ్చిన్నం చేసి ఫిషన్ రియాక్షన్ సృష్టించాడు. మానవ చరిత్రలో మొదటి సారి న్యూక్లియర్ ఛైయిన్ రియాక్షన్ వుపయోగించి శక్తిని సృష్టించడం జరిగింది. అందులో నుండి ఒక లైట్ బల్బ్ వెలిగించే శక్తి మాత్రమే బయటికి వచ్చింది. దానికి కోట్ల రెట్ల శక్తి ని సృష్టించే కార్యక్రమానికి వెంటనే నడుము బిగించడం మొదలయ్యింది. రాబర్ట్ ఆపెన్ హైమర్ ఎన్రికో ఫెర్మీ పరిశోధనల మీద తన కార్యక్రమం నిర్మించాడు. కేవలం మూడు సంవత్సరాల్లోనే లక్షల మంది ప్రాణాలు తీసే యాటమ్ బాంబులు ఆయన సృష్టించగలిగాడు. 

జూలై 16, 1945, 

ఉదయం 5:29 గంటలు 

   ఆపెన్ హైమర్ బృందం  న్యూ మెక్సికో రాష్ట్రములో లోస్ అలామోస్ దగ్గర మొదటి అణు బాంబు పరీక్షకు సిద్ధపడ్డారు. ప్రపంచం అంతం అవుతుందేమో అని కూడా కొంత మంది భయపడ్డారు. మొదట ఒక పెద్ద మెరుపు, తరువాత ఒక పెద్ద వేడి గాలి, తరువాత పెద్ద ప్రేలుడు. గాలిలో 7 మైళ్ళ ఎత్తుకు ఎదిగిన ఒక పెద్ద మేఘం కనిపించాయి. ఒక పెద్ద శబ్దం మూడు రాష్ట్రాల్లో వినిపించింది. మొదటి యాటమ్ బాంబును ఆపెన్ హైమర్ విజయవంతముగా పరీక్షించాడు.

1945 మే నెలలో జర్మనీ దేశం ఓటమి చెందింది. అడాల్ఫ్ హిట్లర్ ఆత్మ హత్య చేసుకొన్నాడు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోలేదు. జపాన్ దేశం ఇంకా యుద్ధాలు చేస్తూనే ఉంది. ఆగష్ట్ 1945 లో అమెరికా దేశం జపాన్ మీద రెండు అణు బాంబులు వేసింది. హిరోషిమా, నాగసాకి నగరాలు బూడిద గా మారాయి. జూలై నెలలో అణుబాంబులు పరీక్షించారు. ఆగస్టు నెలలో జపాన్ మీద వాటిని వేశారు. ఎంత వేగముతో వాటిని చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. హిరోషిమా నగరములో లక్ష మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. నాగసాకి నగరములో 24,000 మంది బూడిద గా మారారు. అణుశక్తి ప్రపంచం కు అర్ధం అయ్యింది. అనేక దేశాలు అణ్వాయుధాల కోసం పోటీ పడ్డాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా దేశాల వద్ద ఇప్పుడు అణు బాంబులు ఉన్నాయి. ఈ దేశాల దగ్గర మొత్తం లక్ష యాభై వేల కు పైగానే ఆయుధాలు ఉన్నాయి. 

    రష్యా గూఢచారులు అమెరికా సైన్యం నుండి అనేక అణు రహస్యాలు దొంగిలించారు. ఆపెన్ హైమర్ కొంత కాలం కమ్యూనిస్టులతో స్నేహం చేశాడు. ఆయన కూడా కమ్యూనిస్ట్ అని, సైనిక రహస్యాలు కమ్యూనిస్టు రష్యాకు పంపించి ఉంటాడని ఆయన మీద కొంత మంది అసూయ పరులు నిందలు వేశారు. అయితే వాటిలో సత్యము లేదు. 

ఆపెన్ హైమర్ సినిమా లో భగవద్గీత, హిందూ మతంను అవమానించారా? 

     ఆపెన్ హైమర్ ఒక యూదు కుటుంబములో జన్మించాడు. అయితే ఇతర మతాల గురించి కూడా ఆసక్తి పెంచుకున్నాడు. అణు బాంబు ను పరీక్ష నప్పుడు ఆయన భగవద్గీత లో ఉన్న ఒక మాట ను చెప్పాడు: 

‘Now I am become death, 

the destroyer of worlds

ఇప్పుడు నేను మృత్యువును అయ్యాను. ప్రపంచాలను నాశనం చేసే వాడిగా మారాను. ఆపెన్ హైమర్ సినిమా లో మాత్రం దీనిని అసభ్యకరంగా చూపించారు. 

ఆపెన్ హైమర్ కు జీన్ టాట్ లోక్ అనే మహిళతో అక్రమ సంబంధం ఉండేది. ఒకరోజు ఆమెతో సన్నిహితముగా గడిపే టప్పుడు వారిద్దరు సెక్స్ చేసుకునేటప్పుడు ఆమె లేచి భగవద్గీత ను తెరచి అతనికి చూపించి ఆ వాక్యాలు చదువు అంటుంది. అతడు వాటిని చదువుతాడు. హిందూ సంఘాలు అది చూసి గొడవ చేశాయి. ఆ చిత్రములో ఈ సన్నివేశం తొలగించాలని ఆందోళనలు చేశాయి. వారి బాధ మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథం ను అలా అసభ్యకరముగా చూపిస్తే మనకు కూడా కోపం వస్తుంది. ఆపెన్ హైమర్ లాంటి సైంటిస్టులు ఒక ఫిలాసఫీ ని ఒంటబట్టించుకొన్నారు. 

అంతా ఒక మాయ. నువ్వు ఒక మాయ. ఈ ప్రపంచం ఒక మాయ అని వారు నమ్మారు. ఈ ఫిలాసఫీ ని వృద్ధి చేయడములో వారు క్వాంటమ్ ఫిజిక్స్ ని కూడా వాడుకొన్నారు. క్వాంటమ్ ఫిజిక్స్ మనం కంటితో కూడా చూడలేని ప్రపంచము ను అర్థం చేసుకోవడములో మనకు ఉపయోగపడుతుంది. 

    1927 లో జర్మన్ శాస్త్రవేత్త వెర్నర్ హైజెన్ బర్గ్ ‘Uncertainty principle’.ప్రతిపాదించాడు.  అనిశ్చితి నియమం అని ఇది పిలువబడింది. హైజెన్ బర్గ్ చెప్పిన సైన్స్ నియమాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకొన్నారు. ‘క్వాంటమ్ ఫిజిక్స్ చేసే పరిశోధనలు పరిశోధన చేసే సైంటిస్టు మీద ఆధారపడి ఉంటాయి’ అనే తప్పుడు అభిప్రాయం వేగముగా అభివృద్ధి చెందింది. ‘ఈ ప్రపంచ పరిస్థితి దానిని చూసే వాడి మీద ఆధారపడి ఉంటుంది’ అనే నమ్మకం వేగముగా ప్రబలింది. క్వాంటమ్ కాన్షన్స్ నెస్, క్వాంటమ్ రియాలిటి ఎవరికి వారే నిర్మించుకోవచ్చు అనే భావం పెరిగింది. 

అయితే ఇది తప్పు. క్వాంటమ్ ఫిజిక్స్ చూసే వాడి మీద ఆధారపడి మారేది కాదు. ఇతర సైన్స్ ల వలె అది కూడా మన అనుభూతుల మీద ఆధారపడేది కాదు. చాలా మంది ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్ సిద్ధాంతమును కూడా తప్పుగా అర్థం చేసుకొన్నారు. రెలెటివిటీ అంటే రెలెటివిజం అనుకొన్నారు. అంటే అబ్సొల్యూట్స్ లేవు. అంతా మనం కల్పించుకొన్నవే అనే అభిప్రాయం పెరిగింది. ఇది మత విశ్వాసాల మీద కూడా ప్రభావం చూపించింది. 

     దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనం పట్టించుకోనక్కరలేదు. భౌతిక ప్రపంచములో ఏ ఆజ్ఞలు లేవు కాబట్టి ఆధ్యాతిక ప్రపంచములో కూడా ఏ ఆజ్ఞలు ఉండకూడదు అనే భావం పెరిగింది. సమస్తం మనిషి కల్పించినవే. సైన్స్ కూడా మనిషి కల్పించిన ఒక అభిప్రాయం మాత్రమే. దానికి వాస్తవికత మీద ఎలాంటి ఆధిపత్యం లేదు అనే వారు ఇప్పుడు పెరిగిపోతున్నారు. అయితే క్రైస్తవ్యం వాటిని ఒప్పుకోదు. బైబిల్ వాటిని ఒప్పుకోదు. ‘ఈ ప్రపంచం ఒక మాయ నేనొక మాయ, నువ్వొక మాయ, దేవుడొక మాయ’ అని మనం అనకూడదు. దేవుడు వాస్తవం, నేను వాస్తవం,మీరు వాస్తవం, ఈ ప్రపంచం ఒక వాస్తవం అని బైబిలు మనకు బోధిస్తున్నది. 

    సైన్స్ ని సృష్టించింది క్రైస్తవ ఆలోచనాపరులే. భౌతిక ప్రపంచం వాస్తవ మైనది అని వారు గుర్తించారు. దానిని అర్థం చేసుకొనే మానసిక, శారీరక అవయవాలను, గ్రహింపు శక్తిని దేవుడు మనిషికి ఇచ్చాడు అని వారు నమ్మారు. భౌతిక ప్రపంచం గందర గోళము లేకుండా కొన్ని నిర్దిష్టమైన నియమాల మీద ఆధారపడి నడుస్తుంది అని వారు నమ్మారు. ఆ నమ్మకాలు లేకపోతే సైన్స్ పుట్టేది కాదు. సైన్స్ కు పునాదులు వేసిన పితామహులు జోహనెస్ కెప్లెర్, ఐజాక్ న్యూటన్, బ్లెయిస్ పాస్కల్, మైఖేల్ ఫారడే, చార్లెస్ బాబేజ్, లూయి అగస్సిజ్, గ్రెగొర్ మెండెల్, లూయీ పాశ్చర్, జేమ్స్ క్లర్క్ మాక్స్ వెల్ – వారందరూ యేసు ప్రభువును నమ్మిన క్రైస్తవులే. దేవుడు ఈ ప్రపంచమును మనం గ్రహించగలిగే టట్లు సృష్టించాడు అని వారు నమ్మారు. 

    20 శతాబ్దములో క్రొత్తగా వచ్చిన క్వాంటమ్ థియరీ, రెలెటివిటీ థియరీ దేవునికి వ్యతిరేకమైనవి కావు. కంటికి కనిపించిన అణువులో సహితం గొప్ప నిర్మాణం ఉందని క్వాంటమ్ థియరీ మనకు చూపిస్తుంది. అది దేవుని యొక్క గొప్ప జ్ఞానం మనకు చూపిస్తున్నది. సమయం కూడా స్థిరమైనది కాదు అనే సత్యం  రెలెటివిటీ థియరీ మనకు తెలియజేసింది. సమయం  స్థిరమైనది కాదు కేవలం నిత్యత్వం మాత్రమే స్థిరమైనది అనే సత్యం బైబిలు మనకు తెలియజేస్తుంది. 

    సాతానుడు అబద్ధాలకు తండ్రి. సమస్త వ్యవస్థలను సాతానుడు అసత్యాలతో నింపి వేశాడు. సైన్స్ కు వదిలిపెట్టలేదు. ప్రజలను దేవుని యొద్ద నుండి వేరుచేయటానికి సాతాను అటువంటి అసత్యాలు నిత్యం సృష్టిస్తాడు. ఆపెన్ హైమర్ ఒక యాటమ్ లో ఉండే గొప్ప శక్తిని బయటకు తీసి ప్రపంచానికి చూపించాడు. మానవాళిని నాశనం చేసే శక్తి ఆ యాటమ్ లలో ఉందని ఆయన నిరూపించాడు. జార్జ్ గమావ్ అనే సైంటిస్ట్ విశ్వమును సృష్టించినప్పుడు ఈ  యాటమ్ శక్తి ఉపయోగించబడింది అని ప్రతిపాదించాడు. 

     దేవుడు ఈ విశ్వమును సృష్టించినప్పుడు ఎంతో గొప్ప శక్తిని వాడాడు. దేవుడు చేసిన పనులను సింగులారిటీస్, రెగులారిటీస్ అని రెండు వర్గాలుగా చెప్పుకోవచ్చు. సింగులారిటీస్ అంటే దేవుడు ఒక్కసారే చేసిన పనులు. ఈ విశ్వమును దేవుడు ఒక్కసారే సృష్టించాడు. మనిషిని దేవుడు ఒక్కసారే సృష్టించాడు. జల ప్రళయం ఒక్కసారే ఈ ప్రపంచాన్ని కబళించింది. అవి సింగులారిటీస్. 

రెండవదిగా రెగులారిటీస్. ఇవి ప్రతిరోజూ దేవుడు చేసే కార్యాలు. ఉదాహరణకు ప్రతిరోజూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ప్రతి నెలా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. దేవుని కాపుదల లేకుండా ఈ పనులు జరుగవు. సృష్టిలో జరిగే కార్యాలన్నిటికీ ఎంతో శక్తి కావాలి. అణు శక్తి వాటికి కీలకం. దేవుడు తన జ్ఞానముతో భౌతిక ప్రపంచం సజావుగా పనిచేసేటట్లు నిర్మించాడు. 

ఒక యాటమ్ లో ఉన్న గొప్ప శక్తిని మనం చూసినప్పుడు వాటిని సృష్టించిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జ్ఞానం, శక్తి గురించి మనం ఆలోచించాలి.  ఆపెన్ హైమర్ లోస్ అలామోస్ దగ్గర నిర్మించిన అణు పరీక్ష కేంద్రానికి ట్రినిటీ అని పేరుపెట్టాడు. దైవిక త్రిత్వం చేత ఆయన ప్రేరేపితుడయ్యాడు. దైవిక త్రిత్వం విశ్వము లో ప్రధాన పాత్ర 

వహించారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు – ఈ ముగ్గురు మన విశ్వమును సృష్టించారు. ముగ్గురూ కలిసే మానవ జాతిని సృష్టించారు. ముగ్గురూ కలిసే మానవులను వారి పాపముల నుండి విమోచించారు. 

ఈ ముగ్గురూ కలిసే ప్రస్తుతం ఈ విశ్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చివరకు, ఈ ముగ్గురూ కలిసే ఈ విశ్వాన్ని నాశనం చేస్తారు. బైబిల్ లో ఆ సత్యం స్పష్టముగా చెప్పబడింది. 2 పేతురు పత్రిక 3 అధ్యాయం 10 వచనం చూద్దాము. 

అయితే ప్రభువు దినము

దొంగవచ్చినట్లు వచ్చును. 

ఆ దినమున ఆకాశములు 

మహాధ్వనితో గతించి పోవును, 

         2 పేతురు పత్రిక 3:10 

పంచభూతములు మిక్కటమైన

వేండ్రముతో లయమైపోవును, 

భూమియు దానిమీద వున్న 

కృత్యములును కాలిపోవును. 

           2 పేతురు పత్రిక 3:11

ఆ మాటలు మీరు గమనించండి. ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఒక దొంగ ఎప్పుడు ఏ ఇంటికి కన్నం వేస్తాడో మనం ఊహించలేము. అదే విధముగా మన ప్రభువైన యేసు క్రీస్తు ఎప్పుడు తిరిగి వస్తాడో మనం ఊహించలేము. ఆయన తిరిగి వచ్చి విశ్వాసులను ఈ ప్రపంచము నుండి వేరు చేస్తాడు. చివరకు ఈ విశ్వం మొత్తం అంతం చేయబడుతుంది. మానవ చరిత్ర మాత్రమే కాకుండా, మన భూమి, సౌర కుటుంబం, నక్షత్ర రాశులు – ఈ విశ్వం మొత్తం గొప్ప విస్ఫోటనములో నశిస్తుంది. 

ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీద వున్న కృత్యములును కాలిపోవును. ఆ దృశ్యం ఎలా ఉంటుందో మీరొక సారి ఊహించండి. అయితే దానిని చూడడానికి, వినడానికి ఈ భూమి మీద ఎవరూ ఉండరు. 

ప్రభువు దినం – ది డే అఫ్ ది లార్డ్ అలా ఉంటుంది. ఆ రోజున దేవుడు ఈ యూనివర్స్ ని సమూలంగా నాశనం చేస్తాడు. మానవుడు చేసిన లక్షలాది  అణు బాంబులు కూడా అటువంటి విస్ఫోటనం సృష్టించలేవు. అయితే అటువంటి దుర్వార్తతో దేవుడు 

ఈ ప్రవచనం ముగించలేదు. మనకు ఒక గుడ్ న్యూస్ కూడా దేవుడు ఇచ్చాడు. 13 వచనం చూడండి. 

అయినను మనమాయన వాగ్దానమునుబట్టి

క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును 

కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.

   దేవుడు ఒక క్రొత్త విశ్వం, అందులో ఒక క్రొత్త భూమి ని సృష్టించబోతున్నాడు. 

ప్రస్తుతం ఉన్న యూనివర్స్ ని నాశనం చేసి దేవుడు ఒక న్యూ యూనివర్స్ ని సృష్టిస్తాడు. దేవునికి ఎంత గొప్ప శక్తి ఉందో మీరొక సారి ఆలోచించండి. వాటి యందు నీతి నివసించును అని పేతురు గారు వ్రాశాడు. 

   ఆ నీతి మనం ఎలా పొందగలం? యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు మనం వెళ్ళాలి. మన పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొందాలి. అప్పుడు దేవుడు మనలను క్షమించి మన పాప ఋణాన్ని కొట్టివేస్తాడు. మనలను యేసు క్రీస్తు నందు నీతి మంతులుగా తీరుస్తాడు. నీతి మంతులుగా తీర్చబడిన వారు మాత్రమే ఈ న్యూ యూనివర్స్ లోకి ప్రవేశించగలరు. తమ పాపములలో చనిపోయిన వారు నరకానికి వెళ్తారు. యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చే రక్షణ పొంది మీరు కూడా దేవుడు చేయబోయే న్యూ యూనివర్స్ లోకి వెళ్ళాలి. అదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply